
ముఖ్యమంత్రిని కలిసిన నూతన సీఎస్ జి. సాయి ప్రసాద్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్)గా బాధ్యతలు చేపట్టిన జి.సాయి ప్రసాద్ ఆదివారం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును మర్యాదపూర్వకంగా కలిశారు. అమరావతిలోని ముఖ్యమంత్రి నివాసంలో జరిగిన ఈ భేటీలో సీఎస్ ముఖ్యమంత్రికి పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. కాగా శనివారం కె. విజయానంద్ నుంచి బాధ్యతలు స్వీకరించిన అనంతరం సాయి ప్రసాద్ సిఎంతో భేటీ కావడం ఇదే తొలిసారి.
రాష్ట్ర పరిపాలనను మరింత వేగవంతం చేయడం ప్రభుత్వ ప్రాధాన్యతలను క్షేత్రస్థాయికి తీసుకెళ్లడంపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చ జరిగినట్లు సమాచారం. ముఖ్యంగా పెండింగ్లో ఉన్న కీలక ప్రాజెక్టులు, అభివృద్ధి కార్యక్రమాల పురోగతిపై ముఖ్యమంత్రి సీఎస్కు దిశానిర్దేశం చేశారు. సమర్థవంతమైన పాలనతో ప్రజలకు చేరువకావాలని, పెట్టుబడుల ఆకర్షణకు పెద్దపీట వేస్తూ రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి చురుగ్గా వ్యవహరించాలని సీఎం సూచించారు.
మరోవైపు మాజీ ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్ కూడా ఆదివారం ముఖ్యమంత్రిని కలిశారు. విజయానంద్ను ప్రభుత్వం ముఖ్యమంత్రికి ఎక్స్-ఆఫిషియో ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా నియమించిన సంగతి తెలిసిందే. తన కొత్త బాధ్యతలకు సంబంధించి ఆయన ముఖ్యమంత్రితో చర్చించారు.
