
మహా ఓపెన్ విజేత ఫెడెరికో సినా
పుణె వేదికగా జరిగిన మహా ఓపెన్ (ఏటీపీ ఛాలెంజర్ 2026) టెన్నిస్ టోర్నీలో ఇటలీకి చెందిన 18 ఏళ్ల కుర్రాడు ఫెడెరికో సినా నూతన ఛాంపియన్గా అవతరించాడు. ఆదివారం బాలేవాడి స్టేడియంలో జరిగిన ఉత్కంఠభరిత పురుషుల సింగిల్స్ ఫైనల్లో ఆరో సీడ్ ఫెడెరికో 6-3, 5-7, 7(7)-6(1) తో గ్రేట్ బ్రిటన్కు చెందిన ఫెలిక్స్ గిల్ పై విజయం సాధించాడు. గత ఏడాది మూడు ఫైనల్స్లో ఓడిపోయిన ఈ ఇటలీ యువ క్రీడాకారుడికి, ఏటీపీ ఛాలెంజర్ టూర్లో ఇదే తొలి టైటిల్ కావడం విశేషం. ప్రపంచ ర్యాంకింగ్స్లో 223వ స్థానంలో ఉన్న ఫెడెరికో, 300వ ర్యాంకర్ అయిన గిల్ మధ్య జరిగిన ఈ పోరు సుమారు రెండు గంటల 29 నిమిషాల పాటు అభిమానులను ఉర్రూతలూగించింది.
తొలి సెట్లో దూకుడైన బేస్లైన్ ఆటతో ఆధిపత్యం ప్రదర్శించిన ఫెడెరికో సులభంగా సెట్ను కైవసం చేసుకున్నాడు. అయితే రెండో సెట్లో గిల్ పుంజుకొని కీలక సమయంలో బ్రేక్ పాయింట్ సాధించడంతో మ్యాచ్ సమమైంది. నిర్ణయాత్మకమైన మూడో సెట్లో ఆట పతాక స్థాయికి చేరింది. ఒకానొక దశలో ఫెడెరికో ఓటమి అంచున నిలిచాడు. తన సర్వీస్ గేమ్లో 5-6 తో వెనుకబడి ఉన్న సమయంలో గిల్ కు లభించిన ఐదు మ్యాచ్ పాయింట్లను అత్యంత సాహసోపేతంగా అడ్డుకున్నాడు. ఆ తర్వాత మ్యాచ్ను టైబ్రేకర్ కు మళ్లించిన ఫెడెరికో, అక్కడ సంపూర్ణ ఆధిపత్యం ప్రదర్శించి విజేతగా నిలిచాడు. కాగా, రెండో రౌండ్లో భారత్ టాప్ ప్లేయర్ సుమిత్ నగల్ ఈ టోర్నీ రన్నరప్ ఫెలిక్స్ గిల్ చేతిలో ఓటమి పాలయ్యాడు.
ఇక శనివారం జరిగిన పురుషుల డబుల్స్ ఫైనల్లో భారత్కు నిరాశే ఎదురైంది. భారత ఆటగాడు నికి పూనచా, థాయ్లాండ్కు చెందిన ప్రుచ్యా ఇసారో జోడీ తీవ్రంగా శ్రమించినప్పటికీ రన్నరప్తోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. దక్షిణ కొరియాకు చెందిన నామ్ జీ-సంగ్, ఫిన్లాండ్కు చెందిన పాట్రిక్ నిక్లాస్-సాల్మినన్ ద్వయం 6-4, 6(1)-7(7), 10-7 తో పూనచా జంటపై విజయం సాధించి డబుల్స్ టైటిల్ను సొంతం చేసుకుంది. టైబ్రేకర్ వరకు వెళ్లిన ఈ పోరులో చివరకు విదేశీ జోడీనే విజయం వరించింది.
