Let's talk: editor@tmv.in

Bold! Concerned! Unfiltered! Responsible!

Sudhir Pidugu
Sudhir Pidugu
Founder & Editorial Director
editor@tmv.in
న్యాయం అందించడంలో న్యాయవాదుల పాత్ర కీలకం: సీజేఐ

న్యాయం అందించడంలో న్యాయవాదుల పాత్ర కీలకం: సీజేఐ

Panthagani Anusha
1 మార్చి, 2026

న్యాయం అందించడమనేది కేవలం న్యాయమూర్తుల బాధ్యత మాత్రమే కాదని అందులో బార్ (న్యాయవాదులు) పాత్ర అత్యంత కీలకమని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ఉద్ఘాటించారు. ఆదివారం తిరుపతి జిల్లాలో ప్రతిపాదిత 16 కోర్టు భవనాల నూతన సముదాయ నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు. నిర్మాణ స్థలానికి చేరుకున్న ఆయనకు ఆంధ్రప్రదేశ్ పోలీసులు గార్డ్ ఆఫ్ ఆనర్ తో ఘనస్వాగతం పలికారు. అనంతరం శాస్త్రోక్తంగా జరిగిన భూమిపూజ కార్యక్రమంలో పాల్గొని శిలాఫలకాన్ని ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సదస్సులో జస్టిస్ సూర్యకాంత్ మాట్లాడుతూ.. న్యాయవ్యవస్థలో బార్, బెంచ్ ప్రత్యర్థులు కాదని అవి ఒకే వ్యవస్థకు రెండు చేతుల వంటివని పేర్కొన్నారు. న్యాయవాద మిత్రులారా మీరు న్యాయవ్యవస్థలో విడదీయరాని భాగం. బార్ సభ్యులు అందించే సహకారం వారు చేసే లోతైన వాదనలే న్యాయమూర్తుల తీర్పుల్లో ప్రతిఫలిస్తాయి. న్యాయవాదులు ఎంత బలంగా స్పష్టంగా వాదిస్తే తీర్పులు కూడా అంతే నాణ్యంగా వస్తాయి. అటువంటి తీర్పులే చట్టంపై సామాన్య ప్రజలకు విశ్వాసాన్ని కలిగిస్తాయి" అని ఆయన అభిప్రాయపడ్డారు.

ఆసుపత్రి తరహాలో భరోసా ఇవ్వాలి

కోర్టు సముదాయాలు ఆసుపత్రుల మాదిరిగా పని చేయాలని జస్టిస్ సూర్యకాంత్ సూచించారు. అనారోగ్యంతో ఉన్న రోగి ఆసుపత్రికి వెళ్లినప్పుడు అక్కడ లభించే ప్రాథమిక చికిత్స ఏ విధంగానైతే భద్రతా భావాన్ని కల్పిస్తుందో అవేదంగానే న్యాయం కోసం కోర్టు గడప తొక్కిన వ్యక్తికి తనకు న్యాయం జరుగుతుందనే నమ్మకం కలగాలని ఆకాంక్షించారు. ఈ నమ్మకాన్ని నెలకొల్పడం బార్, బెంచ్ ఇద్దరి సమాన బాధ్యత అని ఆయన స్పష్టం చేశారు.

మరోవైపు పెరుగుతున్న జనాభా, నగరీకరణ, పారిశ్రామీకరణ దృష్ట్యా న్యాయ మౌలిక వసతుల కల్పనపై రాష్ట్ర ప్రభుత్వాలు దూరదృష్టితో వ్యవహరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. రాబోయే 50 నుంచి 100 సంవత్సరాల అవసరాలను దృష్టిలో ఉంచుకుని భవన నిర్మాణాలు చేపట్టాలని భవిష్యత్తులో భూముల లభ్యత తగ్గిపోయే ప్రమాదం ఉన్నందున ఇప్పుడే సరైన ప్రణాళికలు రచించాలని సూచించారు.

కాగా ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ పి.ఎస్. నరసింహ, జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, జస్టిస్ ఎస్.వి.ఎన్. భట్టి, జస్టిస్ జై మల్య బాగ్చీలతో పాటు పలువురు న్యాయమూర్తులు, జిల్లా ఉన్నతాధికారులు బార్ అసోసియేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు.

న్యాయం అందించడంలో న్యాయవాదుల పాత్ర కీలకం: సీజేఐ - Tholi Paluku