Let's talk: editor@tmv.in

Bold! Concerned! Unfiltered! Responsible!

Sudhir Pidugu
Sudhir Pidugu
Founder & Editorial Director
editor@tmv.in
తెలంగాణలో కాంగ్రెస్ ‘బుల్డోజర్ రాజ్యం’ నడుస్తోంది: కేటీఆర్
తెలంగాణలో కాంగ్రెస్ ‘బుల్డోజర్ రాజ్యం’ నడుస్తోంది: కేటీఆర్

తెలంగాణలో కాంగ్రెస్ ‘బుల్డోజర్ రాజ్యం’ నడుస్తోంది: కేటీఆర్

Gaddamidi Naveen
1 మార్చి, 2026

తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో ‘బుల్డోజర్ రాజ్యం’ నడుస్తోందని, పేదల ఇళ్లను కూల్చడమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం అరాచకాలను సాగిస్తోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. ఆదివారం రాజేంద్రనగర్ నియోజకవర్గంలోని హైదర్ షా కోట్, మధు పార్క్ రిడ్జ్ అపార్ట్‌మెంట్ బాధితులకు సంఘీభావం తెలుపుతూ నిర్వహించిన ‘మూసీ దండి మార్చ్’ పాదయాత్రలో ఆయన పాల్గొన్నారు. సుమారు మూడున్నర కిలోమీటర్ల మేర సాగిన ఈ యాత్రలో మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, పార్టీ నాయకులతో కలిసి వేలాదిమంది బాధితుల ఆవేదనను కేటీఆర్ విన్నారు.

విధ్వంసమే రేవంత్ రెడ్డి విధానం

ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతూ, మూసీ ప్రాజెక్టు పేరుతో పేదలు, మధ్యతరగతి ప్రజల ఇళ్లను కూల్చివేయడం అన్యాయమన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఒకవైపు రాహుల్ గాంధీ దేశంలో బీజేపీ బుల్డోజర్ రాజకీయాలపై విమర్శలు చేస్తూ, తెలంగాణలో జరుగుతున్న కూల్చివేతలపై మౌనంగా ఉందని విమర్శించారు. ముఖ్యమంత్రి ప్రజల ఇళ్లను కూల్చడం, భూములను అమ్మడం, రియల్ ఎస్టేట్ బ్రోకర్ దందా చేయడమే పనిగా పెట్టుకున్నారని విమర్శించారు.

మూసీ బఫర్ జోన్ పేరుతో ఇళ్లను అక్రమంగా ప్రకటించడం సరికాదని, ఇదే అపార్ట్‌మెంట్‌లకు గతంలో కాంగ్రెస్ ప్రభుత్వమే అనుమతులు ఇచ్చిందని కేటీఆర్ గుర్తుచేశారు. అలాంటి అనుమతులు ఇచ్చిన అధికారులపై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. ఒకవైపు వేలాది కుటుంబాలను రోడ్డున పడేస్తూ, మరోవైపు పెద్ద మొత్తంలో ఖర్చుతో అధికార నివాసాల నిర్మాణం చేపట్టడం దారుణమన్నారు.

బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కేవలం రూ.16 వేల కోట్లతో మూసీ సుందరీకరణకు డీపీఆర్ సిద్ధం చేశామని, అందులో ఒక్క ఇల్లుకూడా పోకుండా ప్రణాళిక రూపొందించామని తెలిపారు. రోడ్లు, ఫ్లైఓవర్లు నిర్మాణం కూడా ఆ ప్రణాళికలో భాగమని, కానీ ప్రస్తుత ప్రభుత్వం లక్షన్నర కోట్ల రూపాయల ప్రాజెక్టు పేరుతో వేల ఇళ్లను ధ్వంసం చేస్తోందని కేటీఆర్ విమర్శించారు.

రేవంత్ రెడ్డి ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా ఇళ్ల కూల్చివేతలే ప్రధాన విధానంగా పెట్టుకుందని, రామగుండం, మహబూబ్‌నగర్, ఖమ్మం వంటి ప్రాంతాల్లో కూడా ఇదే పరిస్థితి నెలకొన్నదన్నారు. కేవలం కాంట్రాక్టులు ఇవ్వడం, భూముల విలువ పెంచడం కోసం పేదల జీవితాలను పణంగా పెడుతున్నారని ఆరోపించారు.

అండగా ఉంటాం.. రెండేళ్లు ఓపిక పట్టండి

మూసీ బాధితులు అధైర్యపడొద్దని, కేవలం మరో రెండేళ్ల పాటు తమ ఇళ్లను, ఆస్తులను కాపాడుకోవాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. న్యాయపోరాటంలోనూ పార్టీ తోడుంటుందని తెలిపారు. మరో రెండు సంవత్సరాలు తమ ఇళ్లను, భూములను కాపాడుకోవాలని, భవిష్యత్తులో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరి ఇల్లు, భూమి పోకుండా చూస్తామని హామీ ఇచ్చారు.

ప్రభుత్వ బెదిరింపులకు, డబ్బులు ఇస్తామని చెప్పే ప్రయత్నాలకు లొంగకూడదని, ఐక్యంగా పోరాడాలని మూసీ బాధితులకు కేటీఆర్ పిలుపునిచ్చారు. రాష్ట్రాన్ని “భూ బకాసురుల” నుంచి కాపాడుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే కూల్చివేతలను ఆపాలని, ప్రజల ఆవేదనను గౌరవించాలని ఆయన డిమాండ్ చేశారు.

తెలంగాణలో కాంగ్రెస్ ‘బుల్డోజర్ రాజ్యం’ నడుస్తోంది: కేటీఆర్ - Tholi Paluku