Let's talk: editor@tmv.in

Bold! Concerned! Unfiltered! Responsible!

Sudhir Pidugu
Sudhir Pidugu
Founder & Editorial Director
editor@tmv.in
గల్ఫ్‌లో యుద్ధ మేఘాలు: భారతీయులకు హై అలర్ట్‌

గల్ఫ్‌లో యుద్ధ మేఘాలు: భారతీయులకు హై అలర్ట్‌

Shaik Mohammad Shaffee
1 మార్చి, 2026

మధ్యప్రాచ్యంలో నెలకొన్న యుద్ధ వాతావరణం దృష్ట్యా భారత ప్రభుత్వం అప్రమత్తమైంది. ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య ఘర్షణలు తీవ్రరూపం దాల్చుతున్న నేపథ్యంలో లెబనాన్‌తో పాటు గల్ఫ్ దేశాల్లో నివసిస్తున్న భారతీయ పౌరులకు ఆయా దేశాల్లోని భారత రాయబార కార్యాలయాలు ఆదివారం కీలక హెచ్చరికలు జారీ చేశాయి. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా భారతీయులందరూ అప్రమత్తంగా ఉండాలని, స్థానిక భద్రతా నిబంధనలను తూచా తప్పకుండా పాటించాలని సూచించాయి.

లెబనాన్‌లో అప్రమత్తత

లెబనాన్‌లోని భారత రాయబార కార్యాలయం (బీరూట్‌) ప్రత్యేక అడ్వైజరీని విడుదల చేసింది. ఈ ప్రాంతంలో నెలకొన్న ఉద్రిక్తతల దృష్ట్యా భారతీయులెవరూ అనవసర ప్రయాణాలు చేయవద్దని కోరింది. నిరంతరం అప్రమత్తంగా ఉంటూ స్థానిక ప్రభుత్వం సూచించే అత్యవసర భద్రతా విధానాలను అనుసరించాలని పేర్కొంది. ఏదైనా అత్యవసర పరిస్థితి ఎదురైతే రాయబార కార్యాలయాన్ని సంప్రదించాలని సూచిస్తూ +96176860128 మొబైల్ నంబర్‌ను లేదా cons.beirut@mea.gov.in ఈమెయిల్ ఐడిని అందుబాటులోకి తెచ్చింది.

ఇరాన్, ఖతార్‌లలో 'ఇండోర్' ఆంక్షలు

ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లోని భారత మిషన్ కూడా భారతీయులను అప్రమత్తం చేసింది. వీలైనంత వరకు ఇంటి లోపలే ఉండాలని, అనవసర కదలికలను నివారించాలని సూచించింది. అటు ఖతార్ రాజధాని దోహాలోని రాయబార కార్యాలయం కూడా పౌరులు జాగ్రత్తగా ఉండాలని కోరింది. ముఖ్యంగా మిలిటరీ స్థావరాలకు సమీపంలో ఎవరూ ఉండవద్దని, స్థానిక అధికారులు పంపే అత్యవసర హెచ్చరికలను గమనిస్తూ ఉండాలని స్పష్టం చేసింది. అత్యవసరమైతే తప్ప భవనాల నుండి బయటకు రావొద్దని హెచ్చరించింది.

యూఏఈలోనూ అదే పరిస్థితి

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) లోని భారత రాయబార కార్యాలయం (అబుదాబి) మరియు దుబాయ్‌లోని కాన్సులేట్ జనరల్ కూడా అప్రమత్తమయ్యాయి. యూఏఈలోని భారతీయులు అనవసర ప్రయాణాలకు దూరంగా ఉండాలని, భద్రతా మార్గదర్శకాలను పాటించాలని కోరాయి. అబుదాబి, దుబాయ్ కార్యాలయాలు యధావిధిగా పనిచేస్తున్నాయని, అత్యవసర సహాయం కోసం టోల్ ఫ్రీ నంబర్లు మరియు వాట్సాప్ నంబర్లను సంప్రదించవచ్చని తెలిపాయి.

భారత విదేశాంగ శాఖ స్పందన

మధ్యప్రాచ్యంలో జరుగుతున్న పరిణామాలపై భారత విదేశాంగ శాఖ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. దీనిపై స్పందిస్తూ.. అన్ని దేశాలు సంయమనం పాటించాలని, ఉద్రిక్తతలను తగ్గించుకోవాలని కోరింది. దాడుల వల్ల సామాన్య పౌరులకు నష్టం కలగకుండా చూడటమే అందరి ప్రాధాన్యత కావాలని సూచించింది. సమస్యలను చర్చలు మరియు దౌత్య మార్గాల ద్వారా పరిష్కరించుకోవాలని, అన్ని దేశాల సార్వభౌమాధికారాన్ని గౌరవించాలని స్పష్టం చేసింది. గల్ఫ్ దేశాల్లోని భారత రాయబార కార్యాలయాలు నిరంతరం పౌరులతో టచ్‌లో ఉన్నాయని, ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని అందిస్తున్నాయని విదేశాంగ శాఖ వివరించింది.

గల్ఫ్‌లో యుద్ధ మేఘాలు: భారతీయులకు హై అలర్ట్‌ - Tholi Paluku